కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే

22 May, 2023 06:28 IST|Sakshi

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో బిహార్‌ సీఎం నితీశ్‌ మంతనాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జేడీయూ నేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. ఆదివారం నితీశ్‌ ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్‌ జారీ చేయడం తెలిసిందే.

నితీశ్‌తో చర్చల అనంతరం సీఎం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును రాజ్యసభలో తిప్పికొట్టేందుకు మద్దతివ్వాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి కోరుతానన్నారు. రెండు, మూడు రోజుల్లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌లను కలుస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడాలంటూ నితీశ్‌ కుమార్‌కు కూడా విజ్ఞప్తి చేశానన్నారు.

మరిన్ని వార్తలు