వ్యక్తిగత సమస్యలతో జర్నలిస్ట్‌ ఫేక్‌ డ్రామా: నొయిడా పోలీసులు

26 Jun, 2021 11:47 IST|Sakshi
భార్య చిత్రతో అతుల్‌ అగర్వాల్‌(పాత చిత్రం)

వివాహేతర సంబంధాన్ని భార్యకు తెలియకుండా కప్పిపెట్టాలన్న ఆ భర్త ప్రయత్నం బెడిసికొట్టిందా?. మామూలుగా దొరికి ఉంటే భార్య ఒక్కదాని దగ్గరే బుక్‌ అయిపోయేవాడేమో. కానీ, దొంగతనం డ్రామా ఆడడం.. ఆపై పోలీసులను లాగిన కూపితో అసలు దొంగ బయటపడ్డాడు. దీంతో నిన్నంతా సోషల్‌ మీడియాలో ప్రముఖ హిందీ జర్నలిస్ట్‌ అతుల్‌ అగర్వాల్‌ మీద విపరీతమైన ట్రోలింగ్‌ నడిచింది. 

న్యూఢిల్లీ: నొయిడా(యూపీ) కేంద్రంగా నడిచే హిందీ ఖబర్‌ ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌ అతుల్‌ అగర్వాల్‌.. వారం క్రితం(జూన్‌ 19 అర్ధరాత్రి) తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఆయుధాలతో వచ్చిన కొందరు తనను అడ్డగించి.. బెదిరించి ఐదు వేల రూపాయలు లాక్కున్నారని, చంపేస్తారనే భయంతో బతిమాలుకోగా వదిలేశారని, ఆ క్షణం బిడ్డను తల్చుకుని ఎంతో భయపడ్డానని.. ఇలా తన భావాలన్నింటిని కలగలిపి పెద్ద పోస్టుతో ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. అయితే ఆయన ప్రముఖ జర్నలిస్ట్‌ కావడంతో ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటోగా నొయిడా పోలీసులు దారిదొపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురు ఆఫీసర్లు మొత్తం ఆయన తిరిగే రూట్లలో జల్లెడ పట్టి.. సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను,ఆధారాలను సంపాదించారు. ఇక్కడే అతుల్‌ అడ్డంగా దొరికిపోయాడు.

గర్ల్‌ఫ్రెండ్‌ ఇంటి నుంచి ఓయోకి.. 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొపిడీ జరిగిందని చెప్పిన రోజు సాయంత్రం స్టూడియో నుంచి సరాసరి ఏడు గంటలకు తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాడు అతుల్‌. సుమారు నాలుగు గంటల తర్వాత ఆయన భార్య(చిత్ర) నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే నేరుగా ఆయన ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి.. ఓయో రూమ్‌ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. పనిలో పనిగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఓయో రూంకి డబ్బులు చెల్లించి.. ఆ రాత్రి అక్కడే గడిపాడు. ఆ హోటల్‌ సీసీ ఫుటేజీలో ఆయన వెళ్తున్న దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వ్యక్తిగత కారణాలతోనో, కుటుంబానికి భయపడో ఆయన అబద్ధం చెప్పి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నొయిడా పోలీసులు ఆయన ఫిర్యాదు ఉత్తదేనని చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు ఉంచారు. 

వహ్‌.. అతుల్‌జీ
ఇక అతుల్‌ గుప్తా ఓయో వ్యవహారంపై సోషల్‌ మీడియాలో నిన్నంతా రచ్చ రచ్చ చర్చ నడిచింది. అతుల్‌ అల్లిన కథను ‘పతీ పత్నీ ఔర్‌ వో’ కథగా పోలుస్తూ జోకులు పేల్చారు. అతుల్‌ గుప్తా భార్య చిత్ర త్రిపాఠి కూడా జర్నలిస్ట్‌. ఆమె ఆజ్‌తక్‌ ఛానెల్‌లో యాంకర్‌. దీంతో ఈ యవ్వారం మధ్యలోకి ఆమెను కూడా లాగారు. సోషల్‌ మీడియాలో ఫన్నీ పోస్టులతో మొత్తానికి అతుల్‌ను ఒక ఆట ఆడుకున్నారు.

చదవండి: జీతాల్లివ్వట్లేదని యాంకర్‌ గోడు.. లైవ్‌ ద్వారా వైరల్‌

మరిన్ని వార్తలు