చిన్నారి తీరాకు ఇంజక్షన్‌.. సాయం చేసిన 2.6 లక్షల మంది

8 May, 2021 11:24 IST|Sakshi

ముంబై: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తీరా కామత్‌ కు ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు బుధవారం రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరస్థితి బాగుందని డాక్టర్లు వెల్లడించారు.ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్‌ కామత్‌, ప్రియాంక కామత్‌ల కుమార్తె 'తీరా'కి 8 నుంచి 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే వెన్నెముక కండరాల సమస్య ‘స్పైనల్‌ మస్య్కులర్‌ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపం తలెత్తింది.

అనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స కోసం ముంబై హిందుజా ఆస్పత్రిలో చేర‍్పించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారికి అత్యంత జన‍్యుపరమైన లోపం తలెత్తిందని, ట్రీట్మెంట్‌ కోసం రూ.16 కోట్ల విలువ చేసే ఒక్క ఇంజక్షన్‌ ‘జోల్‌జెన్‌స్మా’ ను వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఇంజక్షన్‌ అమెరికా నుంచి ఇండియాకు తీసుకొని రావాల్సి ఉంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోక దేవుడిపై భారం వేశారు. ‘ఇంపాక్ట్‌ గురు’ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో విరాళాల్ని సేకరించారు. కేవలం 42 రోజుల్లో ప‍్రపంచ దేశాలకు చెందిన 2.6 లక్షల మంది విరాళంగా అందించడంతో ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన జోల్‌ జెస్‌ స్మా ఇంజక్షన్‌ వేశారు. 

ఈ సందర్భంగా హిందుజా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్‌ నీలూ దేశాయ్‌ మాట్లాడుతూ.."8 నుంచి 10వేలలో ఒక్కరికి మాత్రమే ఈ జన్యుపరమైన సమస్య వస్తుంది. తీరాకి కూడా ఇలాంటి సమస‍్యే తలెత్తింది. ఈ అనారోగ్యసమస్యను నయం చేయాలంటే భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిహర్‌, ప్రియాంకలు ఆన్‌ లైన్‌ ద్వారా సేకరించిన విరాళాలతో ఇంజక్షన్‌ తెప్పించి బుధవారమే ఆ ఇంజక్షన్‌ వేశాం. ఆ ఇంజక్షన్‌ పాపపై బాగా పనిచేస్తోంది "అని అన్నారు. మరోవైపు తమ పాప ఖర్చులకు ఇంత పెద్ద మొత్తంలో ప‍్రజలు విరాళం అందిస్తారని ఊహించలేకపోయామని తీరా తల్లిదండ్రులు అన్నారు. కేవలం 42 రోజుల్లో తమ కుమార్తె కోసం భారీ ఎత్తున విరాళాలిచ్చిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి)

మరిన్ని వార్తలు