పతంజలి పేరు ఇకపై వాడొద్దు.. ఆపేయండి! బాబా రాందేవ్‌కు అల్టిమేటం

24 Nov, 2022 21:29 IST|Sakshi

లక్నో: పతంజలి బ్రాండ్‌ పేరిట పలు విక్రయాలు చేపడుతున్న బాబా రామ్‌దేవ్‌, ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్‌పై మండిపడ్డారు బీజేపీ నేత ఒకరు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించొద్దని గురువారం డిమాండ్‌ చేశారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేపడతానని హెచ్చరించారు ఆ బీజేపీ నేత. 

యూపీ కైసర్‌గంజ్ ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌.. రామ్‌దేవ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్‌ గ్రామ పంచాయతీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం బ్రిజ్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. పతంజలి బ్రాండ్‌పై మండిపడ్డారు.  యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్‌దేవ్‌.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు.

‘‘వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, చివరకు.. లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు బ్రిజ్‌ భూషణ్‌. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. రామ్‌దేవ్‌, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 

అంతేకాదు..  అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్‌ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆ మహానుభావుడి స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ ఇలా తన ప్రకటనలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. 

ఇదీ చదవండి:  సచిన్‌ పైలట్‌పై గెహ్లాట్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు