రాసలీలల కేసు: 10 సీడీలు వచ్చినా భయపడను 

26 Mar, 2021 13:53 IST|Sakshi

సూత్రధారిని బయటపెడతా: జార్కిహొళి

సాక్షి, బనశంకరి: ఇంకా పది సీడీలు వచ్చినా భయపడేది లేదు, తగిన వేళలో ఆ మహానాయకుని పేరు బహిర్గతం చేస్తాను అని రాసలీలల సీడీలో చిక్కుకున్న మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి చెప్పారు. గురువారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. గత 10 రోజులుగా సీడీల గురించే చర్చ జరుగుతోంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపేవరకు విడిచిపెట్టను. దేవుని దయతో నిర్దోషిగా బయటికి వస్తాను. ఈ విషయంపై రాద్దాంతం చేస్తున్న వారిపై కూడా సీడీలు విడుదల కావచ్చు అని  తెలిపారు. యువతి తల్లిదండ్రులకు  రక్షణ కల్పించాలని వీడియోలో కోరడం బట్టి ఇది కుట్ర అని మరోసారి రుజువైందన్నారు.

తీవ్రమైన కేసు కావడంతో నేను ఎక్కువగా మాట్లాడను అన్నారు. నేను కూడా సాక్ష్యాధారాలు సేకరించాను, అన్నీ నా జేబులో ఉన్నాయి, వాటిని బహిర్గతం చేస్తే షాక్‌ అవుతారు, సీడీల వెనకున్న ఆ నాయకుని పేరును త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య పట్ల తనకు గౌరవం ఉండేదని, కానీ నాపై అత్యాచారం కేసు నమోదు చేయాలనడం ద్వారా గౌరవం పోయిందని తెలిపారు. ఎక్కువగా మాట్లాడరాదని న్యాయవాది సూచించడం వల్ల అన్ని విషయాలనూ బహిరంగపరచలేనని చెప్పారు.  

చదవండి: 
‘నీ జన్మకు సిగ్గుందా?’ కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్సీ చిందులు
రాసలీలల సీడీ కేసు: నిందితుడి భార్య అరెస్టు!

మరిన్ని వార్తలు