మూడోసారీ మార్పులేదు

11 Aug, 2023 02:05 IST|Sakshi

కీలక  రెపో రేటు 6.5 శాతంగా యథాతథం...

కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాల ప్రభావం

ఆహార ధరలు పెరిగితే రేటు పెంపు తప్పదని సంకేతం

5.1 శాతం నుంచి 5.4 శాతానికి ద్రవ్యోల్బణం అంచనా పెంపు

2023–24 వృద్ధి రేటు అంచనా 6.5 శాతంగా పునరుద్ఘాటన 

ముంబై: ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో  జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పునరుద్ఘాటించారు.  

పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. 

  • వృద్ధి ధోరణి:  2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. 
  • ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో  6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%.  
  • కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి.  
  • డిజిటల్‌ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్‌లో ఆఫ్‌లైన్‌ చెల్లింపులలో నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్‌లో చిన్న విలువ కలిగిన డిజిటల్‌ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్‌స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. 
  • సీఆర్‌ఆర్‌లో లేని మార్పు: బ్యాంక్‌ మొత్తం డిపాజిట్‌లో లిక్విడ్‌ క్యాష్‌ రూపంలో ఆ బ్యాంక్‌ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్‌ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు.  
  • అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్‌ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్‌డీటీఎల్‌ (నెట్‌ డిమాండ్, టైమ్‌ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్‌ క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (ఐ–సీఆర్‌ఆర్‌) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య.  
  • తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్‌ 4–6 మధ్య జరుగుతుంది.

రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్‌ నుంచి ఫిక్సిడ్‌కు..!
పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్‌ రేటు నుంచి  ఫిక్సిడ్‌ రేట్‌ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది.

ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్‌ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం,  రుణగ్రహీతలు ఫిక్సిడ్‌ రేట్‌ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్‌బీఐ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు.

జాగరూకతతో నిర్ణయాలు 
ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి.   లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్‌ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు.    – దినేశ్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌ 

గృహ డిమాండ్‌కు ఢోకాలేదు 
ఆర్‌బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్‌కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది.     – బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ 

మరిన్ని వార్తలు