మీ క్లైంట్‌ ఎందుకు అలా చేశాడు: సుప్రీంకోర్టు

29 Oct, 2020 09:57 IST|Sakshi

మహిళ హత్యకేసులో దోషి ఉరిశిక్షపై సుప్రీం స్టే

తన క్లైంట్‌ను అవసరంగా ఇరికించారన్న న్యాయవాది

కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ: మహిళను అత్యంత పాశవికంగా హత్యచేసిన కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి కిందికోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి వాదనలు పూర్తయ్యేంత వరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్యాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇలాంటి కేసును మేమెప్పుడూ చూడలేదు. అతడు ఓ రాక్షసుడిలా అనిపిస్తున్నాడు’’అని వ్యాఖ్యానించింది. కాగా ఓ బిల్డింగ్‌ కాంప్లెక్సులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్‌ సింగ్‌ అనే వ్యక్తి 2019లో ఓ మహిళను దారుణంగా హతమార్చాడు. ఆమె పొట్టను చీల్చి, అవయాలను బయటకు తీశాడు. ఆ తర్వాత వాటి స్థానంలో వస్త్రాన్ని కుక్కి, వైరుతో కుట్లు వేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికపోయాడు.(చదవండి: ‘గృహ హింస’ బాధితురాలికి ఊరట) 

ఈ నేపథ్యంలో మోహన్‌ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆధారాలు సేకరించి ట్రయల్స్‌ కోర్టు ఎదుట హాజరుపరచగా, అనేక పరిణామాల అనంతరం న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. రాజస్తాన్‌ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఆగష్టు 9న శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో దోషి తరఫు న్యాయవాది, సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషికి ఉరిశిక్షను నిలుపుదల చేసే విధంగా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. ‘‘మీ క్లైంట్‌ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డారు. అసలెందుకు అతడు, పొట్ట చీల్చి అందులో వస్త్రాలు పెట్టినట్లు? అతడేమైనా సర్జనా?’’ అని న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది.

ఇందుకు బదులుగా.. మోహన్‌ సింగ్‌ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, గతంలో ఓ హత్యకేసులో దోషిగా ఉన్నందున ఈ నేరం తనపై మోపారని లూథ్రా వాదనలు వినిపించారు. మృతురాలు చివరిసారిగా అతడితో మాట్లాడిందన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్యకు పాల్పడ్డాడన్న నిర్ధారణకు సరైంది కాదని పేర్కొన్నారు. అంతేగాక, ఈ కేసులో డీఎన్‌ఏ ఎక్స్‌పర్ట్స్‌ ఇంతవరకు విచారణకు హాజరురాలేదని, ఘటనాస్థలంలో గల సీసీటీవీ రికార్డులను కూడా పోలీసులు ఇంతవరకు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ, అప్పటివరకు మోహన్‌సింగ్‌ ఉరిశిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు