ఎంతపనైపాయే! వార్నింగ్‌ లైట్‌ వచ్చిందని విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తే..

18 Apr, 2023 16:06 IST|Sakshi

వార్నింగ్‌ లైట్‌ వెలిగిందని అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. తీరా అధికారులు విమానంలో సోదాలు నిర్వహించగా..అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ బయలు దేరిన స్పైస్‌ జెట్‌ విమానం అనూహ్యంగా కొద్దిసేపటిలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి వచ్చింది.

కాక్‌పిట్‌ నుంచి వార్నింగ్‌ లైట్‌ వెలగడంతో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. దీంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. పైలట్‌ చర్యతో ఒక్కసారిగా వార్నింగ్‌ లైట్‌ ఆగిపోయింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆ విమానాన్ని తనిఖీ చేయగా తప్పుగా వార్నింగ్‌ లైట్‌ని చూపిందని తేలడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు అధికారులు.

కాక్‌పీట్‌లోని కార్గోలో ఎలాంటి పొగ, మంటలు వచ్చిన సంకేతాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానం 140 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు బయలు దేరినట్లు తెలిపారు. తదనంతరం సాధారణ తనిఖీలను పూర్తి చేసి ఆ విమానం తిరుగు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు.

(చదవండి: మిస్‌ అయిన మాజీ రైల్వే మంత్రి..హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..)

మరిన్ని వార్తలు