ఫేస్‌బుక్‌కు లేఖ రాసిన తృణమూల్‌ కాంగ్రెస్‌

2 Sep, 2020 17:10 IST|Sakshi

కోల్‌కతా: ఫేస్‌బుక్‌ ఉద్యోగులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించడాన్ని తప్పుబడుతూ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. ఆ మరుసటి రోజే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా  సోషల్‌ మీడియా  దిగ్గజం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తూ బీజేపీకి మద్దతు తెలుపుతుందంటూ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. టీఎంసీ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ ఈ లేఖను రాశారు. ఈ ఆరోపణను నిరూపించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) భారతదేశంలో 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఫేస్‌బుక్‌ పాత్ర గురించి తీవ్రమైన ఆందోళనలను కలిగి ఉంది అని పీటీఐ నివేదించినట్లు ఓ'బ్రియన్ లేఖలో రాశారు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని నెలలో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో కొన్ని ఖాతాలను బ్లాక్‌ చేయడం  ఫేస్‌బుక్‌, బీజేపీల సంబంధాన్ని సూచిస్తుందని తెలిపారు. బుధవారం, పార్లమెంటరీ కమిటీ సమావేశమై, ప్రతిపక్ష పార్టీల విషయంలో ఫేస్‌బుక్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించడంపై చర్చించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన లేఖతో పాటు జోడించి జుకర్‌బర్గ్‌కు పంపించారు. 

గత నెలలో ఫేస్‌బుక్‌ ప్రతినిధి మాట్లాడుతూ, ‘హింసను ప్రేరేపించే విద్వేషపూరిత సంభాషణ, కంటెంట్‌ను మేము నిషేధించాం. రాజకీయాలను, పార్టీలను పరిగణలోకి తీసుకోకుండా ఈ నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా అమలు చే​స్తున్నాం అని తెలిపారు. ఈ విషయంలో ఇంకా చేయాల్సి ఉందని మాకు తెలుసు. దీనిలో ఇంకా ప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నాం’ అని తెలిపారు.  చదవండి: ఫేస్‌బుక్ చీఫ్‌కు కాంగ్రెస్ మ‌రోసారి లేఖ‌


 

మరిన్ని వార్తలు