Tamil Nadu: మరో కలకలం.. కోయంబత్తూర్‌లో మాస్క్‌ తప్పనిసరి..

22 Nov, 2023 16:31 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోకి కోయంబత్తూరులో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు అక్కడి అధికారులు. కోయంబత్తూరు జిల్లాలో జ్వరానికి సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వైరల్‌ ఫీవర్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు జిల్లాలో జ్వరం భారీన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై.. కోవిడ్‌ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా కలెక్టర్‌ క్రాంతి కుమార్‌ కోరారు. 

ఈ సందర్బంగా కలెక్టర్‌ కాంత్రి కుమార్‌ మాట్లాడుతూ..‘ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఫ్లూ వైరస్‌.. పెద్దలను, పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో, జ్వర బాధితులు పెరుగుతున్నారు. బాడీ పేయిన్స్‌, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించండి. 


ప్రతీ ఒక్కరూ గోరు వెచ్చటి నీటిని త్రాగాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కోవిడ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలరో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి.. సామాజిక దూరం పాటించండి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను సేకరిస్తున్నాం. వారి ఏరియాలో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు