ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్‌ దాడి

14 Dec, 2022 12:50 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్‌ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌పై వచ్చి యాసిడ్‌ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొహన్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌(పీసీఆర్‌)కు యాసిడ్‌ దాడి జరిగినట్లు ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తన చెల్లెలితో బాధితురాలు ఉందన్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ శ్వాతి మలివాల్‌ ట్వీట్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై మీడియాతో వివరాలు వెల్లడించారు బాధితురాలి తండ్రి. ‘మా కుమార్తెలు (ఒకరు 17, ఒకరు 13 ఏళ్ల వయసు) ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా పెద్ద కూతురిపై యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. వారు ముఖాలకు మాస్కులు ధరించారు.’ అని తెలిపారు.

ఇదీ చదవండి: మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి

మరిన్ని వార్తలు