రాజస్తాన్‌లో అప్పుల భారం పెంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

14 Oct, 2023 08:39 IST|Sakshi

కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ 

జైపూర్‌: రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారం పెంచిందని∙కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణ రిలీఫ్‌ క్యాంపుల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆక్షేపించారు.

రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జీడీపీ దారుణంగా పడిపోయిందని మంత్రి మేఘ్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, దుష్పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో నిరుద్యోగం  పెరిగిపోయిందని, నేరాలు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు.  
చదవండి: ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం

మరిన్ని వార్తలు