Hindi Diwas: దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?

14 Sep, 2023 08:36 IST|Sakshi

నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. 

హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది.

1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. 

దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు?

మరిన్ని వార్తలు