ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్గౌడ్ అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ నేతల ఒంటెద్దు పోకడలతో పాటు ప్రభుత్వ పథకాలు అందిన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవన్ని నచ్చకనే పార్టీని వీడినట్లు ఆయన తెలిపారు.
నేటి నుంచి జన చైతన్య యాత్ర
నిజామాబాద్ రూరల్: మండలంలోని సారంగాపూర్ చక్కెర కర్మాగారం నుంచి మంగళవారం జన చైతన్యయాత్ర నిర్వహించనున్నట్లు చక్కెర కర్మాగర పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొండెల సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 వరకు చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామాల్లో యాత్ర నిర్వహిస్తామన్నారు. భారత కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీధర్రెడ్డి యాత్రలో పాల్గొంటాని తెలిపారు.
నేడు బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రచారం
సిరికొండ: మండలంలోని వివిధ గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి దినేష్ కులచారి మంగళవారం ప్రచారం నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని నర్సింగ్పల్లి, న్యావనంది, రావట్ల, తాటిపల్లి, చిమాన్పల్లి, పందిమడుగు, మైలారం, సిరికొండలో ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొనాలని ఆయన తెలిపారు.
ఇస్కాన్ గోవర్ధన పూజ
నిజామాబాద్ సిటీ: నగరంలో నేడు ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ గోవర్ధన పూజ నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రభుజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గం.లకు అన్నకూట్, కీర్తనలు, గోవర్ధన కథ, గోవర్ధన హారతి, దామోదర దీప్ధాన్, మహా ప్రసాదం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
నేడు కంటి వైద్యశిబిరం
నిజామాబాద్నాగారం: నగరంలోని పెన్షనర్స్ భవనంలో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గ్లోబల్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జగత్రెడ్డి, దయాకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9440354683, 9396437571 నంబర్లను సంప్రదించాలన్నారు.
జీపీల్లో రికార్డుల తనిఖీ
బాల్కొండ: మెండోరా మండలం సావెల్, వెల్కటూర్ గ్రామ పంచాయతీల రికార్డులను ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం తనిఖీ చేశా రు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను సరిగి వినియోగించారా? లేదా? అనే అంశాలను పరిశీలించారు. పల్లెప్రగతిలో మంజూరైన నిధుల వివరాలను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచులు నేల్ల లావణ్య, గంగారెడ్డి, సిబ్బంది తదితరులున్నారు.