ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు

3 Jul, 2021 16:28 IST|Sakshi

న్యూజెర్సీ: ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్మారకర్ధం ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జూన్ 27న ఏర్పాటైంది. ఈ సంస్థతో పలు గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడనుంది.  ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా అనేకమంది పాల్గొన్నారు. కాగా ఈ స్వచ్ఛంద సంస్థకు శ్రీనివాస్ గూడూరు ఛైర్మన్ గా, అధ్యక్షుడిగా భాస్కర్ గంటి, వైస్ చైర్ పర్సన్ గా రాజేశ్వరి బుర్రా, కార్యదర్శిగా లక్ష్మి మోపర్తి, కన్వీనర్ గా ప్రవీణ్ గూడూరు, సలహా సంఘం సభ్యుడిగా దాము గేదెల వ్యవహరించ నున్నారు. సంస్థ భవిష్యత్తు గాయనీ గాయకులకు పోటీలను నిర్వహించి ఎస్పీబీ పేరు తో అవార్డు ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు.

సంస్థ ఏర్పాటుపై ఎస్పీ శైలజ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పిన ఈ సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, అందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని సంస్థ ముఖ్య సలహాదారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ళ భరణి , వడ్డేపల్లి కృష్ణ, న్యూజెర్సీ కమిషనర్ ఆఫ్ యుటిలిటీస్ ఉపేంద్ర చివుకుల, లీడ్ ఇండియా యూఏస్ఏ ఛైర్మన్ హరి ఎప్పనపల్లీ, తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి, ఓం స్టూడియో అధినేత అశోక్ బుద్ది, రామాచారి, మాధవపెద్ది సురేష్ , తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ చెందిన ప్రముఖ గాయకులు మనో, సుమన్, మల్లికార్జున్, గోపిక పూర్ణిమ, పార్థు నేమాని , విజయ లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

యూఎస్ఏ ఇతర దేశాల్లోని పలు తెలుగు సంఘాల నాయకులు, వేగేష్నా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వంశీరామరాజు, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ బాల ఇందూర్తి, టిఎఫ్ఏఎస్ ప్రెసిడెంట్ శ్రీదేవి జగర్లాముడి, జీఎస్‌కేఐ ప్రెసిడెంట్ మధు అన్నా, శ్రీవాస్ చిమట తదితరులు ప్రసంగించారు. ఎస్పీబీపై ప్రశంసలు కురిపించారు. బాలూ వ్యక్తిత్వం ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు