నిమజ్జనంలో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం

10 Oct, 2023 10:44 IST|Sakshi
చెరువు బజారులో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జనం

జగ్గయ్యపేట: వినాయక నిమజ్జనంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించటంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 15వ వార్డు పరిధిలోని చెరువు బజారులో టీడీపీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిమజ్జన నిర్వహించడంతో విగ్రహాన్ని ఊరేగించేందుకు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు. శాంతి భద్రతలు పర్యవేక్షణకు ఎస్‌ఐ రామారావు సిబ్బందితో అక్కడకు వచ్చారు. విగ్రహం ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరటంతో ఎస్‌ఐ తలకు తీవ్రంగా గాయమైంది.

ఎస్‌ఐను సిబ్బంది స్థానికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని శాంతి భద్రతలు పర్యవేక్షించారు. నందిగామ ఏసీపీ జనార్దన్‌ నాయుడు అక్కడకు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఘటనపై కేసు నమో దు చేస్తామని ఏసీపీ తెలిపారు. ప్రథమ చికిత్స చేయించుకుని ఎస్‌ఐ అక్కడకు రావటంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు యత్నించినా పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు