కుమారుడి వెంటే కానరాని లోకాలకు.. | Sakshi
Sakshi News home page

కుమారుడి వెంటే కానరాని లోకాలకు..

Published Sat, Nov 11 2023 1:26 AM

- - Sakshi

కంచికచర్ల : కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి షాక్‌కు గురై ఆమె కూడా మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం మండలంలోని మున్నలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంగర నాగరాజు (42) చందర్లపాడు మండలం ఏటూరులో జరిగే ఓ శుభ కార్యానికి గురువారం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మున్నలూరు సమీపంలో మున్నేటిని దాటాల్సి ఉంటుంది. మున్నేటిని దాటే క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో నాగరాజు మునిగిపోయాడు. కుటుంబసభ్యులు రాత్రి వరకు మున్నేటిలో వెతికినా నాగరాజు ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు నాటు పడవలు వేసుకుని వెతకగా మున్నేటిలో శవమై కనిపించాడు. నాగరాజు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు నాగరాజుకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మున్నేటిలో గురువారం గల్లంతయి శుక్రవారం శవమై ఇంటికి వచ్చిన కొడుకు నాగరాజు మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నాగరాజు తల్లి కస్తూరి (68) కుమారుడి మృతిని జీర్జించుకోలేక అరగంటలో స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను వైద్య పరీక్షల కోసం కంచికచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో 108 అంబులెన్స్‌ వాహన సిబ్బందికి ఫోన్‌ చేశారు. సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ పరీక్షించి కస్తూరి మృతి చెందిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లగా గ్రామంలోని కుటుంబసభ్యులు, స్థానికులు బోరున విలపించారు.

మున్నేటిలో గల్లంతయిన నాగరాజు మృతి

నాగరాజు మృతదేహాన్ని చూసి తల్లడిల్లి మృత్యు ఒడికి చేరిన తల్లి కస్తూరి తల్లీ కుమారుడు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు

కస్తూరిని పరీక్షిస్తున్న డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌
1/2

కస్తూరిని పరీక్షిస్తున్న డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌

నాగరాజు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లి కస్తూరి
2/2

నాగరాజు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లి కస్తూరి

Advertisement
Advertisement