అమ్మో పులి..!

17 Aug, 2023 12:10 IST|Sakshi

పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో పులి సంచారం అలజడి రేపుతోంది. ఏనుగుల భయం వీడిందనేసరికి పులి సంచారంతో ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. భామిని మండలం చిన్నదిమిలి–పెద్దిదిమిలి గ్రామాల సమీపంలో బుధవారం పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. చిన్నదిమి లి క్వారీ సమీపంలో మంగళవారం రాత్రి వింత జంతువు అలికిడి గుర్తించినట్టు వాచ్‌మన్‌ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ ఫారెస్ట్‌ రేంజర్‌ తవిటినాయుడు ఆధ్వర్యంలో కొత్తూరు సెక్షన్‌ అధికారి కృష్ణారావు, అటవీశాఖ సిబ్బంది చిన్నదిమిలి సమీపంలో పులిసంచరించే ప్రాంతాన్ని పరిశీలించారు.

పులి పాదముద్రలుగా నిర్ధారించా రు. భామిని, సీతంపేట, కొత్తూరు మండలాల ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని తవిటినాయు డు హెచ్చరికలు జారీ చేశారు. వేకువ జామున బయటకు వెళ్లే రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బత్తిలి పోలీసుల ఆదేశాల మేరకు వీఆర్వో వినోద్‌కుమార్‌, ఏఎస్సై గురుమూర్తి, సర్పంచ్‌ రవికుమార్‌లు గ్రామాల్లో దండోరా వేయించారు.

సీతంపేటలోనూ పులిజాడ
సీతంపేట:
సీతంపేట ఏజెన్సీలో పులిజాడ కనిపించడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. దోనుబాయి–చెక్కాపురం పరిసర ప్రాంతంలో ఉన్న గుగ్గిలంతోటల గుండా పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌బీఓ దాలినాయుడుతో పాటు సిబ్బంది చేరుకుని పులిపాదముద్రలు పరిశీలించారు. దోనుబాయిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక నుంచి పుబ్బాడ గ్రామం కొండలపైకి పులి వెళ్లినట్టు పాదముద్రలు ఆధారంగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు