Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ

9 Jul, 2022 10:16 IST|Sakshi

సాక్షి, ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పార్టీకి నవీముంబైలో మరో గట్టి దెబ్బ ఎదురైంది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనంతరం నవీ ముంబై కార్పొరేషన్‌కు చెందిన 32 మంది మాజీ కార్పొరేటర్‌లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలిసి తమ మద్దతును ప్రకటించారు. దీంతో రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో శివసేనకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి కొంతకాలం ముందు శివసేన పార్టీ నవీ ముంబైలో తన బలం పెంచుకోవడానికి ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునేందుకు మిషన్‌ కార్పొరేషన్‌ ఉద్యమాన్ని చేపట్టింది. ఏక్‌నాథ్‌ షిండే ఆ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.

కానీ రాజకీయంగా పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఏక్‌నాథ్‌ షిండే స్వయంగా శివసేన పార్టీలో తిరుగుబాటు జరిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దాంతో శివసేన పార్టీ ఖంగుతినడమే కాకుండా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడిపోయింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేనుకలిసిన వారిలో మాజీ ప్రతిపక్షనాయకుడు విజయ్‌ చౌగులే, శివరమ్‌ పాటిల్‌తోసహా 32 మంది ఉన్నారు. తామంతా శివసేన పార్టలోనే ఉంటూ ముఖ్యమంత్రి మార్గదర్శనంలో పనిచేస్తామని వారంతా వముక్తకంఠంతో ప్రకటించారు.
చదవండి: అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.. రెబల్స్‌కు థాక్రే సవాల్‌

శివసేన ఉపనాయకుడు వాజయ్‌ నాహటా కూడా తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. శిండే కూటమిలో మాజీ నగరసేవకుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ఐరోలి, బేలాపూర్‌ జిల్లా ప్రముఖులు, ఐరోలి మాజీ కార్పొరేటర్‌ ఎమ్‌కే మాడ్వి, సాన్‌పాడాకు చెందిన సోమవనాత్‌ వాస్కర్‌లాంటి వాళ్లు ఉద్ధవ్‌ ఠాక్రే వెంటే ఉంటారని సమాచారం.

మరిన్ని వార్తలు