'కేసీఆర్‌ పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారు'

28 Nov, 2020 13:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ధ్వజమెత్తారు. ‘మీకు బీజేపీ మేయర్‌ కావాలా..? ఎంఐఎం మేయర్‌ కావాలా..?. కాంగ్రెస్‌కు ఓటువేస్తే టీఆర్‌ఎస్‌కి వేసినట్లే.. టీఆర్‌ఎస్‌కి వేస్తే ఎంఐఎంకు పోతాది’ అంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబిత్‌ పాత్ర  శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.   (బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు)

కుటుంబ పాలన సాగుతోంది..
'భాగ్యనగరానికి రావడం నా అదృష్టం. భాగ్యనగరం ఒక కుటుంబానికే పరిమితమయ్యింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. భాగ్యనగర్‌ అన్నందుకు రెండు రోజుల క్రితం యువరాజు కేటీఆర్‌ చాలా బాధపడ్డాడు. బాధ దేనికి హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చొద్దా..?. ఇక్కడ కుటుంబ పాలన సాగుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌ పాలన ఇది. దుబ్బాకలో కేసీఆర్‌ నివాసం ఉంది. అక్కడ బీజేపీ గెలిచింది. సర్కార్‌ కాదు. కార్‌కి పంక్చర్‌.. సర్‌ ఫామ్‌ హౌస్‌కి పరిమితం. ఏనాడు భారత్‌ అనని ఒవైసీని గెలిపిస్తే హిందూస్తాన్‌ను మార్చేస్తారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించరు..?.

భాగ్యలక్ష్మి గుడికి తాళాలు వేశారు. అంటే పాతబస్తీ వేరే దేశంలో ఉందా.. వీసా తీసుకొని రావాలా..?. పాతబస్తీలోకి రావాలంటే ఎంఐఎం అనుమతి కావాలా..?. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలి. అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లన్నారు. పట్టుమని ఇప్పటిదాకా 1,500 మందికి రాలేదు. ఇలా అయితే 50 ఏళ్లకు అయినా ఇళ్లు రావు. ప్రగతి భవన్‌లో అపరిమితంగా బెడ్‌రూమ్‌లు. సాధారణ జనాలకు మాత్రం ఇళ్లు లేవు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశవ్యాప్తంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం కేసీఆర్‌ ఇవ్వడం లేదు. కనీసం ఇటుక ఇవ్వలేదు. ఫొటోల కోసమే కేటీఆర్‌ వరదల్లో ఫోజులిచ్చారు. గ్లోబల్‌ హైదరాబాద్‌ను వరదల్లో ముంచారు. మీ కబ్జాల వల్ల 80 మంది మరణించారు. వరద సాయం పెద్ద స్కామ్‌. అందరూ ఎన్నికల్లో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి' అని జీహెచ్‌ఎంసీ ఓటర్లను సంబిత్‌ పాత్రా కోరారు.    (బీజేపీలో చేరిన విక్రం గౌడ్‌)

మరిన్ని వార్తలు