'అవినీతిపై పోరాటం చేసిన ఆప్‌.. ఇప్పుడు అదే అవినీతికి పాల్పడుతోంది'

28 Feb, 2023 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్‌ స్కాంలో మనీష్ సిసోడియా అరెస్టుపై కాంగ్రెస్  సీనియర్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాటం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీనే ఇప్పుడు కరప్షన్‌కు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును ఆప్‌ గోవా ఎన్నికల కోసం ఖర్చు చేసిందని ఆరోపించారు. అవినీతిలో వచ్చిన డబ్బును ఆ పార్టీ రాజకీయ  ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తోందని మండిపడ్డారు.

డిల్లీ లిక్కర్ స్కాం కేసులో రాజకీయ ప్రతీకారం లేదని, అది సుస్పష్టమైన అవినీతి కేసు అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.  ఎక్సైజ్ పాలసీకి ఎలాంటి మార్పులు చేయాలని సిసోడియా 2020 సెప్టెంబర్ 4న కమిటీని ఏర్పాటు చేశారని, కానీ అవినీతి కోసం ఆ కమిటీ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. అనంతరం సోమవారం ప్రత్యేక కోర్టులో హజరుపరిచింది. ఈ కేసు విచారణకు ఐదు రోజులు కస్టడీ కోరగా న్యాయస్థానం అనుతించింది.

అయితే తనను అక్రమంగా అరెస్టు చేశారని మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియాకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అనంతరం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.
చదవండి: మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామా

మరిన్ని వార్తలు