టీడీపీలో ప్రతి నేత సంఘ విద్రోహశక్తే 

1 Feb, 2022 04:12 IST|Sakshi

ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: మహిళలను అవమానిస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ నేతలకు నారీ సంకల్ప దీక్షలు చేసే అర్హత లేదని ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలోని ప్రతినేత సంఘ విద్రోహశక్తేనని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు వేసిన మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష అన్నారు. నిస్సిగ్గుగా అత్యాచార నిందితులతో ఆ పార్టీ సంకల్ప దీక్షలు చేస్తోందని మండిపడ్డారు. లోకేష్‌ పీఏ మహిళలను లైంగికంగా వేధించలేదా? అని నిలదీశారు. మహిళా కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేయడం అందరూ చూశారన్నారు.

టీడీపీ హయాంలో మహిళలపై ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం, దగా చేయడమేనని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు జరిగాయని గుర్తు చేశారు. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ పేరుతో ఎంతోమందిని వ్యభిచార కూపంలోకి దించారని నిప్పులు చెరిగారు. వనజాక్షిలాంటి అధికారిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుల తల్లి రిషితేశ్వరిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాను నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు