రేవంత్‌ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్‌

22 Nov, 2023 17:02 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. పోటీలో ఉన్న అభ్యర్దుల గుణగనాలతోపాటు వారి పార్టీల విధానాన్ని చూసి ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. గతంలో కొడంగల్‌ వాసులు ఎక్కడికెక్కడికో వలసలుపోయేవారని.. ఆ పరిస్థితి నేడు మారిందని తెలిపారు. కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రేవంత్‌ మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని అంటున్నారని.. అలాంటి తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్‌ హితవు పలికారు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవడం రైతులకు సాధ్యం కాదని తెలిపారు. ఆ మోటర్లు పెట్టాలంటే 50 నుంచి 60 వేల కోట్లు కావాలని అన్నారు. రేవంత్‌ పెద్ద  భూకబ్జాదారుడని, ఎన్నో భూములు కబ్జా చేశాడని విమర్శించారు. కాంగ్రేస్ ది భూమాత కాదు భూమేత పథకమని మండిపడ్డారు. ధరణి తీసేస్తే పెద్ద ప్రమాదమే అవుతుందన్నారు.

చిప్పకూడు తిన్నా సిగ్గురాలే
‘రేవంత్‌ రెడ్డి అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఆయనవి ఆల్త్ పాల్త్ మాటలు ఇక్కడ పని చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్‌ తుపాకీ పట్టుకొని వెళ్లారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్. ఓటుకు నోటు 50లక్షలతో పట్టుబడిన కేసులో చిప్పకూడు తిన్నా ఆయనకు సిగ్గురాలేదు. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చాడని కాంగ్రెస్ వాళ్లే ఆరోపిస్తూ గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు.

వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు
కాంగ్రెస్‌లో 25 మంది సీఎంలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. సీఎం అవుతాడని మీరు నమ్మి ఓటు వేస్తే నష్టపోతారు. నామీద పోటీకి కామారెడ్డికి వచ్చాడు. అక్కడ ఓడిస్తున్నారు ఇక్కడ కూడా ఓడించాలి. రేవంత్ రెడ్డి పెద్ద దొంగ ఇలాంటి దరిద్రుల పీడ పోవాలి. వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు  నెరవేర్చలేదని అక్కడివాళ్లే వచ్చి చెబుతున్నారు. ’ అని కేసీఆర్‌ మండిపడ్డారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌!

పరిగిలో బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
‘బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది. ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్‌. గతంలో వలసలు, కరువు, కరెంట్‌ కష్టాలు, నీటి కష్టాలు. తెలంగాణ వచ్చాక కరెంట్‌, నీటి కష్టాలు తీర్చుకున్నాం. విధి వంచితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.. పెన్షన్‌ వెయ్యి నుంచి పెంచుకుంటూ వచ్చాం. మూడోసారి అధికారంలో ఇచ్చాక పెన్షన్‌ రూ. 5 వేలుచేస్తాం. కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా?.ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ  దళారుల రాజ్యమే’ నని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు