Tandur: ఓ పార్టీ  నుంచి అడ్వాన్స్‌ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్‌

17 Nov, 2023 07:54 IST|Sakshi

పైసా వాపస్‌ దే

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ ప్రధాన పార్టీ తమ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు దసరా పండుగ సందర్భంగా రూ.3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. పండుగకు ముందుగానే రూ. 50 వేల చొప్పున ముట్టజెప్పింది. మిగిలిన డబ్బులు ఎన్నికలు ముగిసేలోపు రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చింది.

అయితే అడ్వాన్స్‌ (రూ. 50వేలు) పుచ్చుకున్న  కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు.. తీరా ఆ తర్వా­త ప్రత్యర్థి పార్టీలో చేరారు. అక్కడ కూడా రూ.3 లక్షల ఆఫర్, కొందరికి అంతకంటే ఎక్కువ ఆఫర్‌ రావడంతో కండువా మార్చేశారు. అయితే ఇప్పుడు మొదట అడ్వాన్స్‌ డబ్బులిచ్చిన పార్టీ వారు సీన్‌లోకి వచ్చేశారు.  తమ వద్ద డబ్బులు తీసుకొని పార్టీ మారడంతో ఫైర­య్యారు. సదరు సర్పంచ్‌లు, నాయకుల ఇళ్లకు వెళ్లి తమ డబ్బులు వాపస్‌ ఇవ్వాలని హెచ్చరించారు.

అయితే అవతలి పార్టీ నుంచి తమకు ఇంకా డబ్బులు అందలేదని, రాగానే తిరిగి ఇచ్చేస్తామని సదరు సర్పంచ్‌లు, నేతలు చెప్పు­కొస్తున్నారు. మొత్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు రేటు కట్టి కొనుగోలు చేయ­డం చర్చనీ­యాంశంగా మారింది. ఎన్నికల అధికారులకు ఈ తతంగం తెలిసినా సరే.. ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  
చదవండి: గజ్వేల్‌ జేజేల కోసం..

మరిన్ని వార్తలు