రజకబంధు పథకం ప్రకటించాలి: ఆర్‌.కృష్ణయ్య

24 Sep, 2021 08:09 IST|Sakshi
ఆర్‌ కృష్ణయ్య (ఫైల్‌)

సాక్షి, కవాడిగూడ(హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం రజకబంధు పథకం ప్రకటించి ఒక్కో రజక కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందుకోసం ప్రధాని మోదీ జాతీయస్థాయిలో కమిటీని వేయాలని కోరారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాకు ఆర్‌.కృష్ణయ్య  సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులకు ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతోపాటు వారికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ముగ్గు అనిల్, బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: పాలన పక్కన పెట్టి కుట్రలు

మరిన్ని వార్తలు