Karnataka: బొమ్మైకి అసమ్మతి సెగ!  

14 Nov, 2021 08:01 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సీఎం బసవరాజ బొమ్మైకి సొంత పార్టీలో అసమ్మతి రేగుతోందని తెలుస్తోంది. గత 100 రోజుల పరిపాలనలో గొప్ప సాధనలు లేవని, సొంత నిర్ణయాలు శూన్యమని పలువురు నేతలు గుసగుసలాడుతున్నారు. ఇటీవల సింధగి, హానగల్‌ అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల సమయంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి వలస వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని మరికొందరు గుర్రుగా ఉన్నారు. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా కష్ట పడిన వారిని సీఎం పట్టించుకోవడం లేదంటున్నారు.  

ఆ ఇద్దరు మంత్రులపైనే ఆధారం 
బిట్‌ కాయిన్‌ స్కాం ఆరోపణలను గట్టిగా తిప్పకొట్టలేకపోయారని, పరిపాలనలో ఇద్దరు మంత్రులపై ఆధారపడ్డారని ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన సింధగి, హానగల్‌ ఉప ఎన్నికల బాధ్యతను కూడా ఆ ఇద్దరు మంత్రులకే అప్పజెప్పారనే విమర్శలు ఉన్నాయి.

ఏదైనా కానీ ఆ ఇద్దరు మంత్రుల తీర్మానమే సీఎం నిర్ణయం అనే వదంతులున్నాయి. హానగల్‌లో బీజేపీ ఓటమి, బిట్‌కాయిన్‌ స్కాం ఆసరాగా ఆయన ప్రత్యర్థులు అసమ్మతిని తీవ్రం చేయాలనే యోచనలో ఉన్నారు.  

సీఎం మార్పు ఉండదు: హోరట్టె జోస్యం..  
సీఎంగా బొమ్మై ఉత్తమ పాలన అందిస్తున్నారని, ఇప్పట్లో సీఎం మార్పు ఉండబోదని జేడీఎస్‌ నేత, విధాన పరిషత్తు చైర్మన్‌ బసవరాజ్‌ హోరట్టె జోస్యం చెప్పారు. శనివారం ఆయన ధారవాడలో మీడియాతో మాట్లాడారు. బిట్‌ కాయిన్‌ కేసును అధికారులు చూసుకుంటారన్నారు.   

మరిన్ని వార్తలు