కేటీఆర్‌కు కాంగ్రాట్స్‌.. తనయుడిని పొగిడిన కేసీఆర్‌

17 Oct, 2023 17:42 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: తన జీవితంలో సిరిసిల్లాకు వందసార్లు వచ్చానని, ఇక్కడ తనకు బంధువర్గం ఎక్కువని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కలలో ఊహించని అభివృద్ధి సిరిసిల్లలో జరిగిందని, వేసవిలో కూడా అప్పర్‌ మానేర్‌ ఉరకలేస్తోందన్నారు. అప్పర్‌ మానేరును చూస్తే ఆత్మ సంతృప్తి కలుగుతోందని కేసీఆర్‌ అన్నారు.

‘‘కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ఉండటం సిరిసిల్ల అదృష్టం. చేనేత కార్మికుల అవసరాలన్నీ కేటీఆర్‌ తీర్చారు. చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్‌కు అభినందనలు. సోలాపూర్‌ తరహాలో సిరిసిల్ల రూపుదిద్దుకోవాలి. చేనేతల కన్నీళ్లు తుడిచేందుకే బతుకమ్మ చీరలు తెచ్చాం. కొంతమంది దుర్మార్గులు చీరలను కాల్చేసి రాజకీయాలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లను పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికే అన్నం పెడుతోంది. వరిసాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి సాగువుతోంది. పేదల  కడుపునిండేలా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’’ అని సీఎం తెలిపారు.

మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి: కేటీఆర్‌
కలలో కూడా ఊహించని, కల్పన కూడా చేయని అభివృద్ధి ఇవాళ సిరిసిల్లలో కళ్లకు కనబడుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా ఆప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. కన్నీరు చూసిన ఈ నేలలో కేసీఆర్ తాగు, సాగు నీరు అందుతోంది. ఇది చేతల,  నేతన్నల ప్రభుత్వం.. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రమై లెక్కకు మిక్కిలి విద్యా, వైద్య సంస్థలతో సిరిసిల్ల తులతూగుతోంది.. సిరిసిల్లలో మరోసారి జై కొట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు