విద్యార్థుల జీవితాల కంటే ఎగ్జామ్స్ విలువైనవా?
వాయిదా వేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తాం
గాంధీభవన్ వద్ద ధర్నాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
రెండోరోజూ కొనసాగిన ఎన్ఎస్యూఐ ఆమరణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రమవుతున్న సందర్భంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు పెట్టడం ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. వెం టనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రు ల్లోని గందరగోళానికి తెరదించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. గాంధీభవన్లో జరిగిన ధర్నా లో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు. కరోనా అదుపులోకి వచ్చే వరకు పరీక్షలను మరో ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేస్తే నష్టం లేదని అన్నారు. వాయిదా వేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనను కొనసాగిస్తుందని చెప్పారు. కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న పరిస్థితిలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదన్నారు.
భారీగా పోలీసుల మోహరింపు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న ఆయకార్ భవన్ ముందు ధర్నా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. కానీ, గాంధీభవన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నాయి. దీంతో ఉత్తమ్ సహా పలువురు అక్కడే ధర్నాకు దిగా రు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, ఆడమ్ సంతోష్, మైనారిటీ విభాగం చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహై ల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షలన్నింటినీ వాయి దా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గాంధీ భవన్లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా, పలువురు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు.