బీఆర్‌ఎస్‌కు ఎగ్జిట్‌ పోల్స్‌ షాక్‌ !

30 Nov, 2023 20:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ‍‍ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్‌ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్‌ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. 

బీఆర్‌ఎస్‌కు 48 సీట్లే: సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18
ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌లో బీఆర్‌ఎస్‌కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 

కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ : ఆరా మస్తాన్‌ సర్వే 
తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్‌ ‍ప్రీ పోల్‌ సర్వే కూడా బీఆర్‌ఎస్‌కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్‌కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్‌ సర్వే బీఆర్‌ఎస్‌దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్‌ఎ్‌స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

చాణక్య స్ట్రాటజీస్‌లో బీఆర్‌ఎస్‌కు 30 సీట్లే..
చాణక్యస్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌లో బీఆర్‌ఎస్‌ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్‌ఎస్‌కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. 

బీఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ : పల్స్‌ టుడే 
పల్స్‌ టుడే ఎగ్జిట్‌ పోల్‌ బీఆర్‌ఎస్‌కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్‌ గ్రాఫ్‌, థర్డ్‌ విజన్‌లాంటి సంస్థలు బీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది.

మెజారిటీ పోల్స్‌లో వెనుకబడ్డ కారు

సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ రిలీజ్‌ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్‌ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది : కేటీఆర్‌ 

కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ రబ్బిష్‌ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు  ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

మరిన్ని వార్తలు