కొందరికి నేను నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్‌ డే వేడుకల్లో తమిళిసై షాకింగ్‌ కామెంట్స్‌

26 Jan, 2023 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వేడుకల్లో గవర్నర్‌ ప్రసంగిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌.. సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను సర్మించుకున్నారు. ‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్య్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది.. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం’’ అని తమిళిసై అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్‌ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

మరిన్ని వార్తలు