‘బాబు, పవన్‌.. ప్రజల ముందుకొచ్చి చెప్పే దమ్ముందా?’

24 Nov, 2023 19:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన బోట్ల అగ్ని ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వ సాయంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. దత్తపుత్రుడు ఈరోజు 50వేలు, రేపు టీడీపీ నాయకులు లక్ష ఇస్తామని వచ్చారు. రాజకీయం కోసం తప్ప వీరికి ప్రజలపై ప్రేమ లేదని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. 

కాగా, మంత్రి అమర్నాథ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించలేరు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో, అంతక ముందు గానీ విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఉంది. సీఎం జగన్ వైజాగ్ వస్తే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోతుందన్న భయంలో టీడీపీ ఉంది. సీఎం జగన్‌ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం వీరికి నచ్చదు. అందుకే విశాఖ నుంచి పాలనపై విషం చిమ్ముతున్నారు. ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు తీసుకువస్తున్న సీఎం నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలుస్తారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మార్చడానికి సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారు. 

ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా నేతల మాదిరిగా హైదరాబాద్ నుంచి కాకుండా మన విజయవాడ నుంచి సీఎం జగన్‌ విశాఖ వస్తున్నారు. సీఎం జగన్‌ ప్రజల సౌలభ్యం కోసం 26 జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు నిజంగా కొత్త జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను వ్యతిరేకిస్తే ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. చంద్రబాబు, పవన్ పొలిటికల్‌ టూరిస్ట్‌లు. ఈ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులు వికేంద్రీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి అమరావతి నుంచి పాలన జరగాలన్న కోరిక ఉంది. అమరావతి అనే భ్రమను ప్రజల్లో ఇంకా ఉంచాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు