చంద్రబాబు సాయం కోర్టులకు అక్కర్లేదు 

19 Aug, 2020 06:09 IST|Sakshi

కుట్రలు జరుగుతున్నాయనుకుంటే ఏం చేయాలో వాటికి తెలుసు: జీవీఎల్‌ 

రాజకీయ నాయకుల జోక్యం సరికాదు 

వ్యవస్థల గురించి చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు 

సాక్షి, న్యూఢిల్లీ: స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహాయం అవసరం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. కుట్రలు జరుగుతున్నాయనుకుంటే కోర్టులకు తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసన్నారు. కోర్టుల విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని సూచించారు. జీవీఎల్‌ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.   

► వ్యవస్థల గురించి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. వ్యవస్థల్లో లేని వాటిని కూడా ఆయన తనకు అనుకూలంగా చెప్పుకున్న రోజులున్నాయి. ఆయన హయాంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వకుండా చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు.  
► చంద్రబాబు లేఖలో నాకు తెలిసి తన ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని చెప్పలేదు. ఒకవేళ అలా ఉన్నా కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే ఇలాంటి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. 2015లో ఆయన ఫోన్‌ ట్యాప్‌ అయితే రాష్ట్రమంతా మారుమోగింది. 
► చంద్రబాబు ఏదైనా విచారణ జరగాలనుకుంటే ముఖ్యమంత్రికి లేఖ రాయాలి. ప్రధానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ కోరితే కేంద్రం సహకరిస్తుంది. రాష్ట్రాల అభ్యర్థన మేరకు, కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే సీబీఐ విచారణ ఉంటుంది. 
► న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్‌ అవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. న్యాయమూర్తులు, కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉంది. తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో వారికి బాగా తెలుసు.  
► చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్‌పై 14 ఏళ్లుగా స్టే ఉంది. ఇదొక గిన్నీస్‌ బుక్‌లో చేర్చాల్సిన అంశం. అన్ని సంవత్సరాలు ఏరకంగా స్టే ఇచ్చారన్నది చాలా ప్రధానమైన అంశం.  

మరిన్ని వార్తలు