-

‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్‌ హెచ్చరిక

15 Oct, 2022 18:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద తనపై దాడి జరిగిందని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్తుండగా వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌ కార్లపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 

జనసేన కార్యకర్త దాడిలో మంత్రి జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి స్పందిస్తూ.. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్‌ కాదని హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో తిరగలేడని ధ్వజమెత్తారు.
సంబంధిత వార్త: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. 

పవన్‌ సమాధానం చెప్పాలి
వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులు మంత్రులు రోజా, జోగి రమేష్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

గర్జనను పక్కదారి పట్టించేందుకే
గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులు చేసిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. వందమంది రౌడీలతో దాడులు చేశారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పవన్‌ కల్యాణ్‌ రౌడీయిజం చేస్తున్నాడా? దాడి ఘటనపై పవన్‌ తక్షణమే సమాధానం చెప్పాలి. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు. పవన్‌ పిచ్చి వేషాలు వేస్తే చీరెస్తాం’ -ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

మరిన్ని వార్తలు