-

Neena Gupta: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. నటి

27 Nov, 2023 15:11 IST|Sakshi

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు.. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలకడగా ఉండట్లేదు. కొంతకాలానికే విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చుకోవడం దేనికని.. సహజీవనానికి జై కొడుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితులు బాలీవుడ్‌ నటి నీనా గుప్తాకు ఎదురయ్యాయి. నీనా గుప్తా.. భార్యాబిడ్డలున్న క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా పుట్టింది. వీరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్‌ అయింది. సింగిల్‌ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. ఆ తర్వాత 2008లో వివేక్‌ మెహ్రాను పెళ్లాడింది.

సలహాలివ్వడానికి నేను కరెక్ట్‌ కాదు
మసాబా 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న నటుడు సత్యదీప్‌ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. ఇతడికి కూడా ఇది రెండో పెళ్లే.. సత్యదీప్‌ గతంలో హీరోయిన్‌ అదితి రావును పెళ్లాడి, తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. అయితే మసాబా మొదటి పెళ్లి ఆమె తల్లి బలవంతం మీదే జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా నీనా గుప్తా వెల్లడించింది. 'రిలేషన్‌షిప్‌ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్‌ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను.

పెళ్లి చేసి తప్పు చేశా
తను మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.

చదవండి: రైతు బిడ్డ సహా ఏడుగురు నామినేషన్స్‌లో.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్‌!

మరిన్ని వార్తలు