చంద్రబాబు పిచ్చి కూతలు.. రామోజీ చెత్త రాతలు: మంత్రి కాకాణి ఫైర్‌

10 Dec, 2023 10:36 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, మంత్రి కాకాణి ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటీ?. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం. విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటీ?. చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీ విషం చిమ్ముతున్నారు. 

రాష్ట్రంలో తుపాన్‌, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టగలిగాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. విద్యుత్ విషయంలో అపారమైన నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాం. గత రెండు రోజులుగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేక పోయారు. గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు.. వ్యవసాయం దండగ అన్నారు. మేము పరిహారం ఎక్కువగా ఇచ్చామని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట.

ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజం.. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయారు. కందిపప్పుకి, పెసర పప్పుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధం.. దమ్ముంటే చంద్రబాబు నాతో చర్చకు రావాలి. తేదీ, టైమ్‌, ప్లేస్‌ చెబితే వస్తాను. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలి అని కామెంట్స్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు