చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ

22 Aug, 2023 12:57 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని పేర్కొన్నారు. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులున్నారని, తనకు చిరంజీవికి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు.

60 శాతం మంది చిరంజీవి అభిమానులే
గుడివాడలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను మెగాస్టార్‌ను విమర్శించినట్లు నిరూపించాలని సవాల్‌ విసిరారు. తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనన్నారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని పేర్కొన్నారు.

అభిమానుల ముసుగులో టీడీపీ కుట్రలు
సీఎం జగన్‌ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని మండిపడ్డారు. ‘ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం. 

చిరంజీవిని విమర్శించినట్లు ఎలా అవుతుంది?
తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పాను. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా?...ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది’ అని కొడాలి నాని పేర్కొన్నారు.
చదవండి: బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి

మరిన్ని వార్తలు