నిన్న కారుపై గోధుమ బస్తా.. నేడు దాడి యత్నం: మంత్రి అంబటి సీరియస్‌ కామెంట్స్‌

27 Oct, 2023 16:20 IST|Sakshi

టీడీపీ నేతలకు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

నాపై దాడులకు ప్లాన్‌ జరుగుతోందన్న అంబటి

నాకు కులం ఉందని మర్చిపోవద్దని హెచ్చరిక

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ఓవరాక్షన్‌కు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తే కొందరు టీడీపీ వారు దాడికి యత్నించారు. దీంతో, ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి సీరియస్‌ అయ్యారు. 

కాగా, మంత్రి అంబటి శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఒక నిశ్చితార్థానికి వెళ్తే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో హఠాత్తుగా పది మంది వచ్చి వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారు. ఇలాంటి కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న నాపైనే దాడి చేయాలని ప్రయత్నించారు.

రెండు దాడులపై విచారణ జరగాలి..
డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. వీరికి తోడుగా కొన్ని ఛానల్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం. ఉన్మాదులపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటాం. నిన్న నా కారుపై గోధుమల బస్తాలు పడటం, ఇవ్వాళ దాడికి యత్నించటంపై విచారణ జరగాలి.

నన్ను చంపితే రూ.50 లక్షలు..
గతంలో కార్తీక వనభోజనాల సమయంలో నన్ను చంపేసిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినవారిపై కూడా దాడి చేస్తారా?. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారు. ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారు. ఇది ఎంత మాత్రం సహించరానిది. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోండి. అంతేకానీ దాడులు చేస్తామంటే మేము చేతులు కట్టుకుని కూర్చోము. 

టీడీపీ నేతలకు దమ్ముంటే అలా చేయండి..
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాల నిబంధనల మేరకు నడుచుకుంటాం. ఆయన కదలికలను పసిగట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఆ లేఖ ఏంటో? రాసినదెవరో పోలీసుల విచారణలో తేలుతుంది. పెండ్యాల శ్రీనివాస్‌ని చంద్రబాబు దేశం దాటించారు. ఆయన్ని పిలిపించి సీఐడీకి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితే లేదు. ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారు?. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. మీకు దమ్ముంటే రాజమండ్రి జైలు గోడలు పగులకొట్టండి.  దాడికి యత్నించిన ఎనిమిది మంది ఒకే కులం వారు. వారికే కాదు నాకూ కులం ఉందని గుర్తు పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇక, అంతకుముందు ఖమ్మంలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు