అధికారం కోసం కాంగ్రెస్‌ వంద అబద్ధాలు

20 Nov, 2023 05:06 IST|Sakshi
బాబు మోహన్‌ తనయుడికి కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనిస్తున్న మంత్రి హరీశ్‌రావు

హాస్యాస్పదంగా హస్తం మేనిఫెస్టో: మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్‌ తాపత్రయపడుతోందని అన్నారు.

మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్‌ మాటలు చెప్పే కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్‌ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు.

భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్‌ విమర్శించారు. టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్‌ను కలిసి బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.

వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్‌లో చేరిన బాబుమోహన్‌ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్‌ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్‌ కుమారుడు ఉదయ్‌భాస్కర్‌ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

మరిన్ని వార్తలు