పవన్‌ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

19 Sep, 2022 13:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, మంత్రి రోజా సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్‌ మీటింగ్‌లకు వస్తున్నారు. పవన్‌కు సింగిల్‌గా పోటీచేసే దమ్ములేదు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా?. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి.

పవన్‌.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు. విభజన చట్టంలో ఏపీ ఆస్తులపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదు. ప్యాకేజీలు తీసుకుని వేరే పార్టీలకు ఓటు వేయమని చెబుతున్నారు. ఎన్టీఆర్‌, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీచేస్తే.. పవన్‌ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారు. ప్యాకేజీల కోసమే పవన్‌ విమర్శలు చేస్తున్నారు. పవన్‌ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే. ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సీఎం జగన్‌ పాలనకు ఉదాహరణ. ఎమ్మెల్యేగా గెలవని లోకేశ్‌ బాబును మంత్రిని చేశారు. మంత్రిగా లోకేశ్‌ ఏం చేశారు?. చంద్రబాబుది అధికార దాహం. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. అక్రమ కేసులు పెట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతిగా నిలిచారు’ అని స్పష్టం చేశారు.

<

మరిన్ని వార్తలు