రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడు..

26 Aug, 2021 07:32 IST|Sakshi
మాట్లాడుతున్న గువ్వల బాలరాజు

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడని, దమ్ముంటే యుద్ధానికి అనువుగా ఉన్న హుజూరాబాద్‌ వచ్చి డిపాజిట్‌ తెచ్చుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాల్‌ విసిరారు. బుధవారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించామన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీలో నిలవాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌రెడ్డి సమావేశాలకు హాజరుకావడం లేదని అన్నారు.

సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. హుజూరాబాద్‌లో నిజమైన పొలిటికల్‌ యుద్ధం జరుగుతోందని, ఓ పక్క దళితులు, బడుగు బలహీన వర్గాల భూములను దోచుకుని ఈటల రాజేందర్‌ పువ్వుపార్టీ చాటున దాక్కున్నారని అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్‌ అభ్యర్థి దొరకడం లేదని, భవిష్యత్‌లో ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డిని ప్రజలు విశ్వసించరని, ప్రజా నాయకుడిగా కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి, మన్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొలిపాక నిర్మల–శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ప్రగతి భవన్‌ను అంబేడ్కర్‌  బహుజన్‌ భవన్‌గా మారుస్తాం

మరిన్ని వార్తలు