-

బోట్ల దుర్ఘటన మీ దృష్టికి రాలేదా!? 

26 Nov, 2023 05:41 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా? 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి ఎంపీ విజయసాయిరెడ్డి సూటి ప్రశ్న 

తండ్రిని విభేదించిన పార్టీతోనే పురందేశ్వరి అంటకాగుతున్నారు  

ఎల్లో మీడియాను ప్రజలు నమ్మడం లేదు  

సాక్షి, అమరావతి: విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురందేశ్వరిగారూ? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు.. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే.. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టకరమని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం   ఆదుకుందన్నారు.

కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అంటున్న పురందేశ్వరిగారూ.. మరి కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా చెల్లెమ్మా? అని ప్రశ్నించారు. మీ నాన్న ఎన్టీఆర్‌ కేంద్రం ఒక మిథ్య అనేవారు.. కానీ, మీరు మాత్రం అంతా రివర్స్‌లా ఉన్నారు.. అవునులే.. తండ్రిని విభేదించిన పార్టీతోనే అంటకాగుతున్నారుగా అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ  నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందన్నారు. ఇక రాష్ట్రంలో పలుచోట్ల ఈనాడు పత్రికను ఉచితంగా ఇళ్ల ముందు వేస్తున్నారని.. బలవంతంగా ఎల్లో స్టెరాయిడ్స్‌ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ? అని విజయసాయిరెడ్డి అందులో ప్రశ్నించారు. చంద్రబాబు ‘అనుకూల’ మీడియా ఏది రాసినా, చూపినా ప్రజలు నమ్మడం లేదన్నారు.   

మరిన్ని వార్తలు