-

వారిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టింది: మంత్రి కేటీఆర్‌

26 Nov, 2023 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దమ్మున్న నాయకుడు కేసీఆర్‌.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.

నవంబర్‌ 29న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడవారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్‌, రాజాసింగ్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టింది. రాజాసింగ్‌, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ను ఓడిస్తాం. రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు’’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘‘మా నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పీఎం కిసాన్ వేసినప్పుడు రేవంత్ ఎందుకు మాట్లాడారు?. రైతు బంధు కొత్త స్కీమ్ కాదు ...కొనసాగుతున్న స్కీమ్ ఇది. రేవంత్ 3 గంటలు...డీకే శివ కుమార్ 5 గంటలు కరెంట్ అంటున్నారు.. మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌.. తనకు వచ్చిన ఈసీ నోటీసులకు బదులు ఇస్తామని చెప్పారు.
చదవండి: ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు: మంత్రి హరీశ్ 

మరిన్ని వార్తలు