లోకేశ్‌ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష

23 Aug, 2021 03:53 IST|Sakshi

ప్రభుత్వంపై బురద జల్లేందుకు  కుటుంబాన్ని వీధికీడ్చిన లోకేశ్‌  

టీడీపీ కుతంత్రంతో తాము తలెత్తుకోలేకపోతున్నామని భాధిత కుటుంబం ఆవేదన

సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతామని ప్రతిపక్ష టీడీపీ మళ్లీ మళ్లీ రుజువు చేస్తోంది. అందుకోసం సామాన్య మహిళలు, కుటుంబాల పరువు ప్రతిష్టలను భంగపరచడానికి సైతం వెనుకాడని దుష్ట రాజకీయానికి పాల్పడుతోంది. దిశ వంటి పటిష్ట వ్యవస్థతో మహిళా భద్రతకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు రావడాన్ని ఏమాత్రం సహించలేకపోతోంది. గుంటూరులో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అవాస్తవ ప్రచారాన్ని ప్రముఖంగా లేవనెత్తడం.. దానికి టీడీపీ శ్రేణులు తానా తందాన అంటూ రాజకీయ లబ్ధికి తెగబడటం నివ్వెరపరుస్తోంది. తన రాజకీయ ప్రయోజనం కోసం ఇలా దుష్ప్రచారం చేయడం ద్వారా అభం శుభం తెలియని ఓ విద్యార్థిని అవమాన పరుస్తున్నానని, ఆమె కుటుంబాన్ని వీధిలోకి లాగుతున్నాననే కనీస ఇంగిత జ్ఞానం లోకేశ్‌కు లేకపోవడం విస్మయపరుస్తోంది. చదవండి: తాలిబన్ల దమనకాండ

ఇదీ అసలు విషయం..
గుంటూరులో ఓ కానిస్టేబుల్‌ ఎంతగా వారిస్తున్నా తమ కుమార్తెతో చనువుగా మాట్లాడుతున్నారని ఆమె తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌కు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పారు. తాము వారిస్తున్నా సరే మాట్లాడుతుండటం మాత్రమే తమ అభ్యంతరం అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను ఈ నెల 20న సస్పెండ్‌ చేశారు. అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఈ నెల 21న ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తమ సమస్య పరిష్కారమైందని పోలీసు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  

లోకేశ్‌ రాజకీయ రచ్చ...
ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఆ కానిస్టేబుల్‌ ఆ విద్యార్థినిని అత్యాచారం చేశాడంటూ నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో అందరూ విస్తుపోయారు. దీనికి వంత పాడుతూ అత్యాచారం జరిగిందంటూ టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానళ్లలో హడావుడి మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే వారి పేర్లను మీడియాలో ప్రచురించరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీసులు, న్యాయస్థానాలు, పత్రికలు ఈ నియమావళిని కచ్చితంగా పాటిçస్తూనే ఉన్నాయి. కానీ నారా లోకేశ్‌ ఈ కనీస సంస్కారాన్ని కూడా ప్రదర్శించ లేదు.చదవండి: ఐటీ పోర్టల్‌ లోపాలు.. ఇన్ఫోసిస్‌పై కేంద్రం గరం

ఆ విద్యార్థినిపై అత్యాచారం జరగ లేదు.. ఆమె ఏ విధంగానూ వేధింపులకు గురికాలేదు.. కేవలం తల్లిదండ్రులు వద్దని చెప్పినా సరే ఆమెతో కానిస్టేబుల్‌ మాట్లాడారు. ఆ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. లోకేశ్‌ వైఖరితో తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని వాపోతున్నారు. లోకేశ్‌ తీరును రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది.  

మరిన్ని వార్తలు