టికెట్ల కేటాయింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

15 Dec, 2023 12:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీతో సయోధ్యగా ఉన్న వారికే టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు టికెట్‌ ఆశించేవారు వ్యక్తిగతంగా 10 వేల నుంచి 15 వేల ఓట్ల వరకు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.

తాను జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ చేస్తానన్నది వాస్తవం కాదని, ఎన్నికల కమిషనే రూ.40 లక్షలు ఖర్చు చేయవచ్చని చెబుతుంటే.. తాను జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ చేస్తానని ఎలా చెబుతానని ప్రశ్నించారు. ‘2019 ఎన్నికల్లో ఉదారతతో కొంత మందికి పార్టీ టికెట్‌ ఇచ్చాం. టీడీపీతో పొత్తుకు అభ్యంతరం తెలపని వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు.. కేంద్రంలో అధికారంలో ఉండే ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉండక తప్పదని చెప్పారు. తాను బీజేపీతో కలిశానని తనను ముస్లింలు నమ్మడం లేదన్నారు. ‘నేను బీజేపీతో ఉన్నా, మీ వైపు మాత్రమే పవన్‌­కళ్యాణ్‌ ఉంటాడు’ అని గుర్తు పెట్టుకోండన్నారు.   

>
మరిన్ని వార్తలు