Pegasus: మీ భార్య, కుమార్తె ఫోన్లలో కూడా: కాంగ్రెస్‌

19 Jul, 2021 21:29 IST|Sakshi

 హోంమంత్రి అమిత్‌షాను తొలగించాలి

ప్రధాని మోదీపై దర్యాప్తు జరిపించాలి:  కాంగ్రెస్‌

కచ్చితంగా ఇది రాజద్రోహమే : రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా

సాక్షి, న్యూఢిల్లీ: పెగాసెస్‌ ట్యాపింగ్‌ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడింది. రాజ్యాంగ కార్యనిర్వాహకులు, కేంద్ర మంత్రులు, సీనియర్ ప్రతిపక్ష నాయకులు, న్యాయ మూర్తులు, జర్నలిస్టులు, ఇతరుల సెల్‌ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తా కథనాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్ ద్వారా మోదీ ప్రభుత్వం ఇక బెడ్‌ రూం సంభాషణలుకూడా వింటుందని ఆరోపించారు. బీజేపీ స్నూపింగ్‌కు పెట్టింది పేరనీ, అది  భారతీయ జాసూసీ పార్టీ అంటూ విమర్శించారు. జాతీయ భద్రతను పణంగా పెట్టి విదేశీ కంపెనీకి డేటాను అప్పగించడమంటే కచ్చితంగా ఇది రాజద్రోహమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవినుంచి తొలగించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

స్పైవేర్ పనితీరును, మన ఫోన్లను ఎలా ప్రభావితం చేస్తుందో లాంటి వివరాలపై కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సోమవారం స్పందించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తోపాటు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సెక్యూరిటీ కీలక అధికారులు, చివరికి మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్లపై కూడా నిఘా పెట్టడం  సిగ్గు చేటన్నారు. అంతేకాదు ఇక మన కుమార్తె లేదా భార్య ఫోన్లను పెగాసస్‌ ద్వారా ట్యాప్‌ చేస్తుందన్నారు. వాష్‌రూమ్‌లోఉన్నా..పడకగదిలో ఉన్నా, మీ భార్యతోను, కుమార్తెతోనో మాట్లాడుతూ ఉన్నా.. ఆసంభాషణపై కూడా మోదీ ప్రభుత్వం నిఘా పెట్టగలదని సుర్జేవాలా విలేకరుల సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ గ్రూపుకు చెందిన ‘పెగసస్’ అనే స్పైవేర్ టెర్రరిస్టు కార్యకలాపాలు, ఇతర నిఘా కార్యకలాపాల కోసం ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రభుత్వ సంస్థలకు విక్రయిస్తుందని,ఇపుడువీరందరినీ టెర్రరిస్టులుగా భావిస్తున్నారా మండిపడ్డారు.

అటు కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రాకూడాపెగాసస్‌ వ్యవహారంపై ట్విటర్‌ ద్వారా విమర్శలు గుప్పించారు.పెగసస్ నిఘా చాలా దారుణమన్నారు. రాజ్యాంగబద్ధంగా భారతీయ పౌరులకు ప్రాథమిక హక్కుగా లభించిన గోప్యతా హ్యక్కుపై మోదీ సర్కార్‌ తీవ్రమైన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోందన్నారు. ఇది ప్రజల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని ట్వీట్‌ చేశారు. కాగా  ఫోన్ల ట్యాపింగ్‌ విషయాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అటు స్పైవేర్ పెగాసస్‌ ద్వారా ప్రముఖుల ఫోన్లపై నిఘా వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ కూడా తోసిపుచ్చింది.నిరాధార ఆరోపణలను చేసినందు వల్ల తాము పరువు నష్టం దావా వేయనునున్నట్టు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు