చంద్రబాబుకు కొత్త టెన్షన్‌.. సన్నిహితులపై ఆక్రోశం!

4 Nov, 2023 15:21 IST|Sakshi

జనం మనల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?

సన్నిహిత కోటరీ నేతలతో చంద్రబాబు ఆక్రోశం

డబ్బులు వెదజల్లితేనే గచ్చిబౌల్ కాంసెర్ట్  చేయగలిగామన్న సన్నిహితులు

మనోవేదనలో చంద్రబాబు..

ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. పదనాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న అనుభవం. మరో పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహారం. అన్నీ ఉండీ కూడా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తే ఏ ఒక్క వర్గం నుంచీ కూడా ఎందుకు స్పందన లభించలేదు? చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే  తప్పు చేశారు కాబట్టే జైలుకు పంపారని అంటున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బాబు కుటుంబ సభ్యులు మినహా  ఏ ఒక్కరూ కూడా అరెస్ట్ అన్యాయం అన్న మాటే అనడం లేదు. ప్రజల నుండి స్పందన ఉందని అనిపించుకోవడం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గచ్చిబౌలిలో  సంగీత కచేరి తరహా కార్యక్రమం నిర్వహించారే తప్ప ప్రజలు తమంతటగా తాము బాబును విడదల చేయాలని కూడా కోరలేదు. ఇదే చంద్రబాబును తీవ్రంగా కలచి వేసిందట.

రూ.371 కోట్ల లూటీ కేసులో చంద్రబాబును సెప్టెంబరు తొమ్మిదో తేదీన అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నా  అయ్యో పాపం అన్న వారే లేకుండా పోయారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ చంద్రబాబుకు అన్యాయం జరిగిందని  భావించడం లేదు. ఆయన దోపిడీకి సంబంధించి.. దర్యాప్తు సంస్థల వద్ద సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపిందని వారు నమ్ముతున్నారు. ఒక్క నారా, నందమూరి కుటుంబాలు .. సినీరంగంలోని ఓ నలుగురు టీడీపీ కార్యకర్తలు, బాబు కేబినెట్‌లో పదవులు అనుభవించిన వారు తప్ప ఎవ్వరూ కూడా బాబును అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంతా అంటున్నారు. ఏ తప్పూ చేయకపోతే  చంద్రబాబు అండ్ కో ఎందుకంత ఫ్రస్ట్రేషన్‌లో కూరుకుపోయారో చెప్పాలని వారంటున్నారు.

చంద్రబాబు జైల్లో ఉంటే మా నాయకుణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఏ వర్గమూ అనలేదు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. ఏ ఒక్క వర్గమూ అండగా నిలబడటంలేదని కుత కుతలాడిపోతూనే.. గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగుల పేరిట ఓ మ్యూజికల్ కాంసెర్ట్ తరహా షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు సామాజిక వర్గ పెద్దలే కోట్లు ఖర్చు పెట్టి వివిధ రంగాలకు చెందిన వారిని ఐటీ ఉద్యోగుల ముసుగులో గచ్చిబౌలి స్టేడియానికి తరలించారు. చంద్రబాబు వల్ల లబ్ధిపొందాం కాబట్టే ఆయనకు మద్దతుగా స్టేడియానికి వచ్చి షో చేశామని ఐటీ ఉద్యోగులమని చెప్పుకుంటున్న వారు అన్నారు. 

లాజిక్‌ మిస్‌..
ఒక వేళ అదే నిజం అనుకున్నా ఇక్కడే టీడీపీ నేతలు చంద్రబాబు తరఫున హడావిడి చేస్తోన్న కొద్దిమంది ఓ లాజిక్ మిస్ అయిపోతున్నారు. 14ఏళ్ల చంద్రబాబు పాలనలో లబ్ధి పొందింది కేవలం కొద్ది మంది ఉద్యోగులే అని వారికి వారే చెప్పుకుంటున్నారు. ఆయన గురించి రైతులు కానీ.. విద్యార్ధులుకానీ.. కార్మికులుకానీ.. మహిళలు కానీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు కానీ ఎందుకు గచ్చిబౌలి తరహా  కార్యక్రమాలు నిర్వహించలేదు. ఎక్కడా ఆందోళనలు  చేపట్టలేదు. కనీసం నినాదాలు కూడా చేసింది లేదు.

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై జైలు నుండి విడుదలైనప్పుడు తనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పుకున్నారు. అయితే, అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మాత్రం సన్నిహితులతో మాట్లాడుతూ చంద్రబాబు చాలా నిర్వేదంగా మాట్లాడినట్లు సమాచారం. ఇదేంటి? ఏ ఒక్క వర్గానికీ మనం అక్కర్లేదన్నమాట.. మనల్ని అరెస్ట్ చేస్తే ఎవరికీ ఏమీ కాదన్నమాట అని తన వాళ్లతో చెప్పుకుని బాధపడ్డారని తెలుస్తోంది. గచ్చిబౌలి కార్యక్రమం అయినా మనంతట మనం చొరవ తీసుకుని డబ్బులు ఖర్చు పెడితేనే అయ్యిందని సన్నిహితులు చెప్పడంతో చంద్రబాబు మొహం వివర్ణం అయిపోయిందని భోగట్టా.

ప్రజలంతా ఒక విధంగా తనని బాయ్ కాట్ చేసేశారని చంద్రబాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మనం వారిని పట్టించుకోలేదు.. ఇపుడు వారు మనల్ని పట్టించుకోవడం లేదని ఓ సీనియర్ నేత అనడంతో చంద్రబాబు ఏం మాట్లాడలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారట. నాలుగు వారాల్లో కంటి ఆపరేషన్ చేయించుకుని మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో జనాన్ని ఆకర్షించడానికి ఇక మార్గమే లేదా అని  ఆయన మదనపడుతున్నట్లు చెబుతున్నారు.
-కుర్చీ కింద కృష్ణయ్య.

మరిన్ని వార్తలు