గ్రూపిజం పెంచుతావా? 

3 Aug, 2020 01:33 IST|Sakshi

సాక్షి, అబిడ్స్‌ : బీజేపీ రాష్ట్ర కమిటీలో తాను చెప్పిన ఏ ఒక్కరికీ స్థానం కల్పించకపోవడంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోధా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడ్డారు. ఇంతకూ తెలంగాణలో బీజేపీని అభివృద్ధి చేస్తావా, గ్రూపిజం పెంచుతావా..? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. ఆదివారం బండి సంజయ్‌ నూతన కమిటీ ప్రకటించడంతో అందులో గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన ఏ ఒక్కరికి స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజాసింగ్‌ బండి సంజయ్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం లోనే తాను ఏకైక బీజేపీ ఎమ్మెల్యేనని, తన కు కనీసం బండి సంజయ్‌ గౌరవం ఇవ్వ లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. గోషామహల్‌ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కనీసం తాను సిఫారసు చేసిన ఏ ఒక్కరికైనా పార్టీ లో పదవి ఇస్తే బాగుండేదని ఆయ న తెలిపారు. గ్రూప్‌ రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి బండి సంజయ్‌ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని రాజాసింగ్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు