‘అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి నానాయాగీ చేస్తున్నారు’

1 Mar, 2021 14:12 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సాధిస్తామని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో చంద్రబాబు డ్రామా సృష్టించారని సజ్జల ధ్వజమెత్తారు.

టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎస్‌ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు హామీలను ఎందుకు నెరవేర్చలేదో.. ప్రజలంతా కలిసి చంద్రబాబును నిలదీయాలన్నారు.

చదవండి: ఎస్‌ఈసీ అసహనం: టీడీపీ నేత వర్ల రామయ్య ఔట్‌..
 

మరిన్ని వార్తలు