ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి
అబద్ధాలతో రైతుల్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు
రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: మద్దతు ధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి అని, ఈ పద్ధతి దశాబ్దాలుగా సాగుతోందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతాకుమార్ కమిటీ ధాన్యం ఎగుమతులు చేయాలని, పంటలన్నీ సేకరించాలని సూచించినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరు తదితర అంశాలపై నిరంజన్రెడ్డి రాష్ట్ర రైతులకు గురువారం బహిరంగ లేఖ రాశారు.
బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలతో రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలబింస్తోందని లేఖలో మండిపడ్డారు. కేంద్రం రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా నష్టపోకుండా రైతులు వరికి బదులుగా ఇతర పంటలు పండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలమన్నారు.
ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ప్రతి సీజన్కు ముందే ఏయే పంటలు వేయాలో సూచనలు చేస్తుందన్నారు.