బీజేపీకి సవాల్‌.. దమ్ముంటే తీసుకెళ్లండి!

6 Nov, 2020 08:08 IST|Sakshi
ఉద్ధవ్‌ ఠాక్రే (ఫైల్‌ఫోటో)

యూపీకి చిత్ర పరిశ్రమ తరలిస్తారనడంతో సీఎం ఉద్ధవ్‌ వ్యాఖ్యలు

సాక్షి, ముంబై : ముంబై చిత్రపరిశ్రమను ఉత్తరప్రదేశ్‌కు తరలించే సత్తా ఉంటే తీసుకెళ్లవచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే  సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వినోదరంగాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. వినోదరంగం అభివృద్ధికి సంబంధించి గురువారం ముంబైలో జరిగిన వెబినార్‌కు సీఎం ఉద్ధవ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్, మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అమిత్‌ దేశ్ముఖ్, బాలీవుడ్‌ చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు అందించాల్సిన సౌకర్యాలపై సీఎంతో చర్చించారు. (అర్నబ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు)

బాల్‌ఠాక్రేకు చిత్రపరిశ్రమతో అనుబంధం
నిర్మాతలను చిత్ర పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. మరాఠీ చిత్రాల కోసం థియేటర్లను ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ధవ్‌ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చిత్ర పరిశ్రమ తరలించడానికి చర్చలు జరుగుతున్నాయని, వారికి అంత సామర్థ్యం ఉంటే తీసుకెళ్లవచ్చని ఈ సందర్భంగా సీఎం సవాల్‌ విసిరారు. ఇక తన తండ్రి బాల్‌ఠాక్రేకు సినీరంగానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. తన తండ్రికి రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, దేవ్‌ ఆనంద్‌ తదితర నటులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఉద్ధవ్‌ గుర్తుచేసుకున్నారు. ప్రొడక్షన్‌ హౌస్, స్టూడియోల నిర్మాణాలకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమ కేవలం వినోద రంగం మాత్రమే కాదు, మంచి సమాజాన్ని సృష్టించే సాధనం కూడా అని సీఎం అన్నారు. పరిశ్రమ పురోగతి, వృద్ధి కోసం మహా ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ఉద్ధవ్‌ హామీ ఇచ్చారు.

అద్దె మాఫీని పరిశీలిస్తాం
లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి తెరిచిన థియేటర్ల అద్దెను మాఫీ చేయాలన్న నిర్మాతల డిమాండ్‌ను తమ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం చెప్పారు.  థియేటర్లను బుక్‌ చేసుకున్న డబ్బు కోల్పోవడం, నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇతర నష్టాలు తెలుసన్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల అద్దెను మాఫీ చేయాలన్న నిర్మాతల డిమాండ్‌ను రాష్ట్రం సానుకూలంగా పరిశీలిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో పలు సినిమా థియేటర్లు ప్రభుత్వ నిర్వహణ సంస్థలచే నిర్వహిస్తామని సీఎం స్పష్టంచేశారు. అయితే థియేటర్లలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేస్తారని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్‌ కోర్టులను పరిశీలిస్తామని తెలిపారు. కరోనా ముప్పు తొలగిపోలేదని గుర్తుపెట్టుకోవాలని సీఎం నిర్మాతలకు సూచించారు. పనిని ప్రారంభించి, నటులను, ప్రేక్షకులను జాగ్రత్తగా చూసుకోండని ఉద్ధవ్‌ తెలిపారు. 

మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అమిత్‌ దేశ్‌ ముఖ్‌ మాట్లాడుతూ.. సిని పరిశ్రమను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. షూటింగ్‌లకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ముంబైలోని ఫిల్మŠస్‌ విభాగంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌ వీడియో సందేశంలో తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో పనులు ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర విభిన్నమైన సహజ వనరులు కలిగి ఉందని, సినిమా షూటింగ్‌లకు మంచిదని జవదేకర్‌ అన్నారు. ఇక చిత్ర నిర్మాత సిద్దార్థ్‌ రా>య్‌ కపూర్‌ నిర్మాతలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సింగిల్‌ విండో క్లియరెన్స్‌లను అందించాలని కోరారు. చిత్ర పరిశ్రమకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సృష్టించడానికి పీపీపీ (పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌)

మరాఠీ సినిమాలకు ప్రాధాన్యం
నమూనాను నిర్మాత–దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా సూచించారు. సాధారణ ప్రజలు టిక్కెట్లు పొందగలిగే స్క్రీన్ల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు. ముంబై, పుణే మధ్య మరో ఫిల్మ్‌ సిటీని సృష్టించాలని మెహ్రా కోరారు. మరాఠీ చిత్రాల కోసం ప్రత్యేకంగా థియేటర్లను ఏర్పాటుచేయాలని మరాఠీ నటుడు సుబోధ్‌ భావే ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టెంట్ల వద్ద సినిమాలు ప్రదర్శించే అవకాశం ఉండాలని తెలిపారు.

మరిన్ని వార్తలు